31, అక్టోబర్ 2015, శనివారం

పద్య సారస్వత పరిషత్తు ఆవిర్భావం

30న విరించి వానప్రస్థాశ్రమంలో ఆవిర్భావ సభ 
మనదైన తెలుగు పద్యాన్ని పరిరక్షించుకోవడం, భాషాభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాల (ఆంద్ర – తెలంగాణా) పరిధిగా రాజమండ్రి వేదికగా నూతనంగా ‘పద్య సారస్వత సమితి’ ఏర్పాటైంది. ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కార్యవర్గం కూడా రూపుదిద్దికుంది. అలాగే ఓ మాస పత్రిక కూడా నడపాలని నిర్ణయించారు. బహుశా ‘పద్య భారతి’ పేరు ఖరారు అయ్యే అవకాశాలున్నాయి. ఇక లాంచనంగా సంస్థ ఆవిర్భావ సభ అక్టోబర్ 30వ తేదీ ఉదయం 10గంటలకు రాజమండ్రి శ్రీరామ నగర్ శ్రీ విరించి వానప్రస్థాశ్రమంలో సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పద్య సారస్వత సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ సిబివి ఆర్ కె శర్మ గురువారం ఉదయం ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. మాస పత్రిక సంపాదక వర్గం డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు , శ్రీ పెరుమాళ్ళ రఘునాధ్, సాగి శ్రీరామ చంద్ర మూర్తిలతో కల్సి నిర్వహించిన సమావేశంలో శ్రీ శర్మ మాట్లాడుతూ ఇప్పటికే జనభావన, త్రివేణి సమ్మేళనం , ఆంద్ర పద్య కవితా సదస్సు , నన్నయ సారస్వత పీఠం సంస్థల ద్వారా పద్య పరిరక్షణ కోసం చేస్తున్న కృషిని ఆయన ప్రస్తావిస్తూ , పద్యం పట్ల చులకన భావం పోగొట్టడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. 
ఎంతచేసినా ఎన్ని చేసినా పర్యాయ పదాలు లేని ఇంగ్లీసు భాషా ప్రభావం అధికంగా వుండడం వలన గ్రామీణ వ్యవస్థ నుంచి తెలుగు భాషను , పద్య ప్రాధాన్యం నిలబెట్టడానికి తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు కల్సి , పద్య సారస్వత సమితి ఏర్పాటు చేసినట్లు శ్రీ శర్మ చెప్పారు. శుక్రవారం ఉదయం 10గంటలకు జరిగే సభలో గాయకులూ , హెడ్ కానిస్టేబుల్ శ్రీ సత్యనారాయణ లలిత సంగీత లహరితో కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. పద్య సారస్వత సమితి అధ్యక్షులు శ్రీ చదలవాడ లక్ష్మీ నరసింహారావు అధ్యక్షత వహిస్తారు. ఆదిత్య విద్యా సంస్థల సంచాలకులు శ్రీ ఎస్పీ గంగిరెడ్డి సభా ప్రారంభం చేస్తారు. 10.58గంటలకు సంస్థ శీర్షిక ను బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు , ఎం ఎల్ సి శ్రీ సోము వీర్రాజు ఆవిష్కరిస్తారు. సంస్థ చిహ్నాన్ని నగర మేయర్ శ్రీమతి పంతం రజనీ శేషసాయి ఆవిష్కరిస్తారు. ప్రతిజ్ఞను ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి నిర్వహిస్తారు . శ్రీ చల్లా సాంబి రెడ్డి (హైదరాబాద్ పావని సేవా సమితి) విశిష్ట అతిధిగా పాల్గొంటారు.
డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు మాట్లాడుతూ పద్యమైనా , గద్యమైనా ఆదరించాలన్నారు. రస స్పర్స గల ఒక వ్యాఖ్య మైనా సరే కావ్యమే నని అయన విశ్లేషించారు. ఈ సందర్భంగా పద్యం చదివి వినిపించి , ఆహ్లాద పరిచారు. శ్రీ పెరుమాళ్ళ రఘునాధ్ మాట్లాడుతూ ఓ మంచి ప్రయత్నంతో ఆవిర్భవిస్తున్న పద్య సారస్వత సమితి ఆశయం నెరవేరాలని ఆకాంక్షించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి