9, జులై 2015, గురువారం

పీసపాటి నరసింహ మూర్తి గారి జయంతి సందర్భముగా

"నటవిద్యాధర" డా. పీసపాటి
హృద్యంబౌనె పఠింప రాగ కవితాహీనంబుగా పద్యముల్
ఆద్యంతంబు సరాగ డోలికల నోలార్చుంగదా నీదియౌ
పద్యం బో నరసింహమూర్తి ! మధు శశ్వత్పూర్ణకంఠా ! కళా
వేద్యా ! మాన్య "కళాప్రపూర్ణ నటనావిజ్ఞాన పారంగతా !
తగుమాత్రపు రాగంబున
నిగమోచ్చారణ విధాన నిస్తుల నటనన్
తగుహావభావముల నీ
పగిదిన్ పద్యము పఠించు భావుకుడేడీ !
ఏడీ నీవలె హాయిగ
పాడంగల గాయకుండు పండితవర్యా !
చూడగ నా శ్రీకృష్ణుడె
నే డీ ధర నవతరించె నీ రూపమునన్.
నటనంబును తపమంచు నెంచి ధృత నానానవ్యయోగంబులన్
పటు దీక్షన్ పలు హావభావములు నైపథ్యంబు శోధించుచున్
నటనాంభోనిధి పార మందితివి విన్నాణంబు సాధించుచున్
"నటవిద్యాధర !" కొల్లగొంటి వఖిలాంధ్ర ప్రేక్షక స్వాంతముల్.
"బెల్లపుకొండ" తీపియు, మీసపు సొగసు
మదిగోరె నిను ప్రేమ మాననీయ !
"బందా" కనకపు శోభయు, గానమాధురి
ప్రీతిగూడె నిను సంగీతరాయ !
"యడవల్లి" వారి యాయత సౌకుమార్యంబు
పట్టువడె నమేయ భాగధేయ !
"మాధవపెద్ది" సమ్మానార్హమౌ ఠీవి
పూర్ణంబుగా నబ్బె బుధవిధేయ !
"చతురభినయధురీణ !" సచ్చరిత ! "ఆంధ్ర
పద్యకవితా సదస్సు" సద్భక్తితోడ
చందురున కొక్క నూల్ప్రోగు సరణి సలుపు
సత్కృతిం గైకొనుము "నటచక్రవర్తి !"

"పద్యకవితిలక"
డా.యస్వీ.రాఘవేంద్రరావు,
ఎం.ఏ.,బి.ఇడి.,ఎం.ఫిల్.,పిహెచ్.డి

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బొమ్మూరులో "తెలుగులో నదీ సాహిత్యం" పై "గోష్ఠి"