1, మార్చి 2013, శుక్రవారం

"మనతెలుగు - తెలుగుతల్లి"


         "మనతెలుగు - తెలుగుతల్లి"
                             (గేయం)

 పల్లవి.  తేట తేట మాటలకు - ఆటపట్టు మన తెలుగు
           తీయని జాతీయాల - తేనెపట్టు మన తెలుగు || తేట  తేట ||

   చ. 1.  మల్లె విరితావి వోలె - ఉల్ల మలరించు తెలుగు
            మలయమారుతము వోలె - పులకింత గూర్చు తెలుగు || తేట తేట ||

        2.  ఆపాత మధురంబై - హర్ష మొందించు తెలుగు
             ఆలోచనామృతమై - ఆనంద మందించు తెలుగు || తేటతేట ||

        3.  మృణాళ నాళము పగిది - మృదులంబైనది తెలుగు
             తేనెసోనల పురుడించు - తియ్యందనాల తెలుగు || తేటతేట ||

        4.   అవధానకళ కెంతో- అద్దము పట్టిన తెలుగు
              కర్ణపర్వ పద్యమును - కన్నతల్లి మనతెలుగు || తేటతేట ||

        5.   అతిథుల నభ్యాగతుల - నాదరించు జాతి తెలుగు
              మహిత పూర్వ సంస్కృతిని - మన్నించు జాతి తెలుగు || తేటతేట ||
            
        6.   సకలకళల కాణాచి - జన కరుణా వారాశి
              కామితార్థ కల్పవల్లి - ప్రేమరాశి తెలుగుతల్లి || తేటతేట ||     
       
        7.   నన్నయ తిక్కనాది కవుల - కన్నతల్లి తెలుగుతల్లి     
              అన్నమయ్య త్యాగయ్యల - కన్నతల్లి తెలుగుతల్లి || తేట తేట ||

        8.   రుద్రమ్మ చానమ్మల - భద్రమాత తెలుగుతల్లి
              రాయల ప్రతాపరుద్రుల - లాలించిన తెలుగుతల్లి || తేటతేట ||

                                                  డా.యస్వీ. రాఘవేంద్రరావు,
                                                        ఎం.ఎ.బి.ఇ.డి.ఎం.ఫిల్.పిహెచ్.డి.,
                                                          రాజమహేంద్రవరం.
(ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహింపబడిన   గేయాల పోటీ కోసం రచించబడినది )
                    

30, జనవరి 2013, బుధవారం

బసవన్న విశ్వరూపం


బసవన్న విశ్వరూపం

  • -ముదిగొండ శివప్రసాద్
  •  
  • 27/01/2013
బసవ భావ ప్రభ
వీరశైవ సాహిత్య ప్రసంగములు. వెల: రూ.100/-
ప్రతులకు:
డా.ఎస్.వి.రాఘవేంద్రరావు,
ఎమ్‌ఐజి 59, సుమ శ్రీనివాస్,
ఎపిహెచ్‌బి కాలనీ, లాలా చెరువు, రాజమండ్రి-6)
కర్ణాటక ప్రాంతంలోని హింగుళేశ్వర బాగెవాడిలో వీరశైవ ప్రవక్త బసవేశ్వరుడు జన్మించారు. ఆనాటి కల్యాణ సామ్రాజ్య ప్రభువైన బిజ్జలుని ఆస్థానంలో బసవన్న దండనాయకునిగా ప్రధాన మంత్రిగా ఉద్యోగించారు. శైవం, వీర శైవ ధర్మం అత్యంత ప్రాచీనమైనవి. రేణుకాచార్యుల వలన ఆ యుగంలో వ్యాప్తి చెందింది. వీరి ఆచార్యులు వీరశైవ పీఠాధిపతులు. బసవన్న శైవ లింగాయత ధర్నానికి ఎన్నో సంస్కరణలు చేశారు. ముఖ్యంగా దయలేని ధర్మమేమిటని చాటారు. దేహమే దేవాలయం అన్నారు. స్ర్తి జనోద్ధరణ, అస్పృశ్యతా నివారణ చేశారు. పణ్యాంగనలను పుణ్యాంగనలుగా మార్చారు. ఆర్థిక వికేంద్రీకరణలో అత్యాధునిక సామ్యభావాలను నేటికి ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వమే బసవన్న ప్రవచించారు. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణము రచించి బసవేశ్వరుని జీవితాన్ని ప్రపంచానికి మొదటిసారిగా అందించారు.
రాజమహేంద్రవరములో ఇటీవల ఆంధ్ర పద్య కవితా సదస్సు వారి ఆధ్వర్యంలో బసవ సమ్మేళనం జరిగింది. ఆ సందర్భంగా ప్రముఖులు చేసిన ప్రసంగాలు బసవ తత్వము ఒక సంకలన గ్రంథముగా వెలువరించారు. అదే బసవ భావ ప్రభ. ఇందులో ఆయా ప్రముఖులు చేసిన ప్రసంగాల సందర్భంగా అసంఖ్యాక బసవేశ్వర వచనములలో కొన్నింటిని ఉదహరించారు. వాని ద్వారా బసవ తత్వం మనకు అవగతమవుతుంది. గుత్తి చోళదరాశి చంద్రశేఖరరెడ్డి, వారణాసి సుబ్రహ్మణ్యం, లలితాంబిక, ప్రొఫెసర్ శలాక రఘునాధ శర్మ వంటి ప్రముఖులు చేసిన ప్రసంగ వ్యాసాలున్నాయి. అలాగే సుమారు ఎనుబది సంవత్సరాలకు పూర్వం కాకినాడ కేంద్రంగా వీర శైవ ధర్మ ప్రచారం చేసిన బండారు తమ్మయ్య జీవన సాహిత్యాలపై పరిచయ వ్యాసం కూడా ఉంది. సదస్సు నిర్వహించడమే కాక అందలి సారాన్ని శాశ్వతంగా నిలిచేటట్లు గ్రంథ రూపంలో తెచ్చిన నిర్వాహకులు అభినందనీయులు. బసవ తత్వం తెలుసుకోవాలని కోరే సహృదయులకు ఈ చిన్ని గ్రంథం కరదీపికగా ఉపయోగపడుతుంది.
Home
Wednesday January 30, 2013 17:21