31, అక్టోబర్ 2015, శనివారం

భావకవివర్య! దేవులపల్లి వంశ్య !


"మనతెలుగు - తెలుగుతల్లి"

"మనతెలుగు - తెలుగుతల్లి"
(గేయం)
పల్లవి. తేట తేట మాటలకు - ఆటపట్టు మన తెలుగు
తీయని జాతీయాల - తేనెపట్టు మన తెలుగు || తేట తేట ||
చ. 1. మల్లె విరితావి వోలె - ఉల్ల మలరించు తెలుగు
మలయమారుతము వోలె - పులకింత గూర్చు తెలుగు || తేట తేట ||
2. ఆపాత మధురంబై - హర్ష మొందించు తెలుగు
ఆలోచనామృతమై - ఆనంద మందించు తెలుగు || తేటతేట ||
3. మృణాళ నాళము పగిది - మృదులంబైనది తెలుగు
తేనెసోనల పురుడించు - తియ్యందనాల తెలుగు || తేటతేట ||
4. అవధానకళ కెంతో- అద్దము పట్టిన తెలుగు
కర్ణపర్వ పద్యమును - కన్నతల్లి మనతెలుగు || తేటతేట ||
5. అతిథుల నభ్యాగతుల - నాదరించు జాతి తెలుగు
మహిత పూర్వ సంస్కృతిని - మన్నించు జాతి తెలుగు || తేటతేట ||
6. సకలకళల కాణాచి - జన కరుణా వారాశి
కామితార్థ కల్పవల్లి - ప్రేమరాశి తెలుగుతల్లి || తేటతేట ||
7. నన్నయ తిక్కనాది కవుల - కన్నతల్లి తెలుగుతల్లి
అన్నమయ్య త్యాగయ్యల - కన్నతల్లి తెలుగుతల్లి || తేట తేట ||
8. రుద్రమ్మ చానమ్మల - భద్రమాత తెలుగుతల్లి
రాయల ప్రతాపరుద్రుల - లాలించిన తెలుగుతల్లి || తేటతేట ||
"ఆంధ్రశ్రీ", "పద్యకవితిలక", "సరసకవి"
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు.

పద్య సారస్వత పరిషత్తు ఆవిర్భావం

30న విరించి వానప్రస్థాశ్రమంలో ఆవిర్భావ సభ 
మనదైన తెలుగు పద్యాన్ని పరిరక్షించుకోవడం, భాషాభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాల (ఆంద్ర – తెలంగాణా) పరిధిగా రాజమండ్రి వేదికగా నూతనంగా ‘పద్య సారస్వత సమితి’ ఏర్పాటైంది. ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కార్యవర్గం కూడా రూపుదిద్దికుంది. అలాగే ఓ మాస పత్రిక కూడా నడపాలని నిర్ణయించారు. బహుశా ‘పద్య భారతి’ పేరు ఖరారు అయ్యే అవకాశాలున్నాయి. ఇక లాంచనంగా సంస్థ ఆవిర్భావ సభ అక్టోబర్ 30వ తేదీ ఉదయం 10గంటలకు రాజమండ్రి శ్రీరామ నగర్ శ్రీ విరించి వానప్రస్థాశ్రమంలో సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పద్య సారస్వత సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ సిబివి ఆర్ కె శర్మ గురువారం ఉదయం ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. మాస పత్రిక సంపాదక వర్గం డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు , శ్రీ పెరుమాళ్ళ రఘునాధ్, సాగి శ్రీరామ చంద్ర మూర్తిలతో కల్సి నిర్వహించిన సమావేశంలో శ్రీ శర్మ మాట్లాడుతూ ఇప్పటికే జనభావన, త్రివేణి సమ్మేళనం , ఆంద్ర పద్య కవితా సదస్సు , నన్నయ సారస్వత పీఠం సంస్థల ద్వారా పద్య పరిరక్షణ కోసం చేస్తున్న కృషిని ఆయన ప్రస్తావిస్తూ , పద్యం పట్ల చులకన భావం పోగొట్టడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. 
ఎంతచేసినా ఎన్ని చేసినా పర్యాయ పదాలు లేని ఇంగ్లీసు భాషా ప్రభావం అధికంగా వుండడం వలన గ్రామీణ వ్యవస్థ నుంచి తెలుగు భాషను , పద్య ప్రాధాన్యం నిలబెట్టడానికి తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు కల్సి , పద్య సారస్వత సమితి ఏర్పాటు చేసినట్లు శ్రీ శర్మ చెప్పారు. శుక్రవారం ఉదయం 10గంటలకు జరిగే సభలో గాయకులూ , హెడ్ కానిస్టేబుల్ శ్రీ సత్యనారాయణ లలిత సంగీత లహరితో కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. పద్య సారస్వత సమితి అధ్యక్షులు శ్రీ చదలవాడ లక్ష్మీ నరసింహారావు అధ్యక్షత వహిస్తారు. ఆదిత్య విద్యా సంస్థల సంచాలకులు శ్రీ ఎస్పీ గంగిరెడ్డి సభా ప్రారంభం చేస్తారు. 10.58గంటలకు సంస్థ శీర్షిక ను బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు , ఎం ఎల్ సి శ్రీ సోము వీర్రాజు ఆవిష్కరిస్తారు. సంస్థ చిహ్నాన్ని నగర మేయర్ శ్రీమతి పంతం రజనీ శేషసాయి ఆవిష్కరిస్తారు. ప్రతిజ్ఞను ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి నిర్వహిస్తారు . శ్రీ చల్లా సాంబి రెడ్డి (హైదరాబాద్ పావని సేవా సమితి) విశిష్ట అతిధిగా పాల్గొంటారు.
డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు మాట్లాడుతూ పద్యమైనా , గద్యమైనా ఆదరించాలన్నారు. రస స్పర్స గల ఒక వ్యాఖ్య మైనా సరే కావ్యమే నని అయన విశ్లేషించారు. ఈ సందర్భంగా పద్యం చదివి వినిపించి , ఆహ్లాద పరిచారు. శ్రీ పెరుమాళ్ళ రఘునాధ్ మాట్లాడుతూ ఓ మంచి ప్రయత్నంతో ఆవిర్భవిస్తున్న పద్య సారస్వత సమితి ఆశయం నెరవేరాలని ఆకాంక్షించారు.

29, అక్టోబర్ 2015, గురువారం

అంతర్వేది "శ్రీలక్ష్మీనృసింహస్వామి"వారి ఆలయనిర్మాత శ్రీ కొపనాతి కృష్ణమ్మవర్మగారు

అంతర్వేది "శ్రీలక్ష్మీనృసింహస్వామి"వారి
ఆలయనిర్మాత శ్రీ కొపనాతి కృష్ణమ్మవర్మగారు
"నరజన్మం బిల దుర్లభంబు, బహుజన్మప్రాప్త
పుణ్యంబు, త
న్నర జన్మం బిల సార్థకం బగు జగన్నాథున్
ప్రకీర్తింపగన్,
మరి దేవాలయ మంటపాదుల వినిర్మాణంబు
సామాన్యమే ?
ధరణిన్ "కృష్ణమ" జన్మ సార్థకమె "యంతర్వేది
నిర్మాతగాన్."
"ఆంధ్రశ్రీ", "పద్యకవితిలక", "సరసకవి"
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు.

27, అక్టోబర్ 2015, మంగళవారం

" ప్రజారాజధాని"

" ప్రజారాజధాని"
రాజధాని యిదే 'మన రాజధాని'
ఇందు 'మన మట్టి' 'మన నీరు' పొందుపరచి
రనుచు భావితరాలకు వినుచు ఘనత
కలుగు మనకు నాత్మీయతాగరిమ తోడ.
రైతు రాజయ్యె పొలమిచ్చి రక్తితోడ
రాజధాని వినిర్మాణ రమ్య హర్మ్య
రచన కొరకు 'నిటుక' లీయ రండు! రండు!
ఇంటి కొక పూవు, మాలగు నీశ్వరునకు
పాలుగొను డమరావతి భవ్యనగర
నిర్మితిన్ "బాబు" పిలుపున నిష్ఠతోడ.
ఆంధ్రవైభవ ప్రాభవ సాంద్ర కీర్తి
శాతవాహనాదిక వంశ చక్రవర్తు
లేలిన "యమరావతి" యమరేంద్ర రాజ
ధాని నే డాంధ్రులకు రాజధాని యయ్యె,
ధాన్యకటకంబు నా నాటి ధరణికోట,
యిది "ప్రజా రాజధాని" వర్ధిల్లుగాక!
తెలుగు కీర్తి పతాకయై వెలుగుగాక!
"ఆంధ్రశ్రీ", "పద్యకవితిలక", "సరసకవి"
డాక్టర్ యస్వీ.రాఘవేంద్రరావు.

10, అక్టోబర్ 2015, శనివారం

అభినందన



                                          అభినందన
 
              "అరుదౌ జ్ఞాపకశక్తి, సర్వవిషయైకాసక్తి, ధీయుక్తి, యే
              బిరుదుల్ బొందని పాండితీగరిమయున్ పెంపారు మీ సొమ్ములై,
              సరసుల్ మెచ్చెడు న్యాయవాదివర! గఛ్ఛత్ గ్రంథభాండారమా!
              వెరపేలేని విలేకరీ! పఠితవై వేవేల గ్రంథాలకున్
              చిరకీర్తిన్ గడియించుకొంటిరి ధరన్ శ్రీసూర్యనారాయణా!"
    "విశ్వనాథ, మల్లంపల్లి, విదిత సుకవి అల్ల ఆంధ్రపురాణకర్తాది సాహి
    తీ విరాణ్మూర్తుల యనుబంధిత సదస్సు గౌతమీతీర "సాహిత్య గౌతమి" తన
    "షష్టిపూర్తి" సంబరములు జరుపుకొనదె? తనవ్యవస్థాపకునితోడ ఘనత మీర
    "పోతుకూచి" వంశాంబుధి పూర్ణచంద్ర! సూర్యనారాయణా! నమస్సుమ శతంబు!
    ఆయురారోగ్యభాగ్యమ్ములందుడయ్య!అందుకొనుడయ్య!మాయభినందనములు!"
                                                భవదీయుడు,
                      
                                "ఆంధ్రశ్రీ", "పద్యకవి తిలక", "సరసకవి",
                                   డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు.

1, అక్టోబర్ 2015, గురువారం

"స్వఛ్ఛభారత్"

"స్వఛ్ఛభారత్"
"తొలుదొల్తన్ పనిచేసి చూపవలె నెంతో శ్రధ్ధగా,
పిమ్మటన్
పలుకంగావలె" నంచు జెప్పెనుగదా "బాపూజి",
నీ కార్యముల్
సలుపంబూనుట "స్వఛ్ఛభారత" మగున్
సంకోచ రాహిత్యతన్,
తెలిపెన్ దాని "నరేంద్రమోడి" ప్రజకున్ దేశంపు
క్షేమంబుకై.
ప్రతివారున్ స్వగృహంబులన్, పరిసర
ప్రాంతంబులన్, స్వఛ్ఛశు
భ్రతలన్ పాలనజేయ "భారతము" తా
"స్వఛ్ఛంబగున్" పూర్తిగా,
సతతంబుందురు భోగభాగ్యములతో
స్వాస్థ్యంబు శోభిల్లగన్,
అతిపూజ్యంబగు భారతంబు ధరలో
నాధ్యాత్మికస్వఛ్ఛతన్.
డా .యస్వీ రాఘవేంద్ర రావు .

మహాత్మా గాంధీ జయంతి సందర్భముగా



సత్యాహింసల నాయుధద్వయముగా శాంతంబు త్రాణంబుగా
అత్యాశాపరతన్ విశాల భరతజ్యాపాలనాసక్తులౌ
అత్యుగ్రారుల యుక్కడంచితివి పూజ్యా ! దాస్య నిర్మూలకా !
"జాత్యారాధిత ! గాంధితాత !" కొనుమా శ్రద్ధాత్మ భక్త్యంజలిన్.
డా .యస్వీ రాఘవేంద్ర రావు .